సర్వేలో పాల్గొనని కేసీఆర్ కుటుంబం సామాజిక న్యాయం గురించి మాట్లాడుతోంది: ఉత్తమ్ కుమార్ విమర్శ

  • సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, స్వాతంత్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్న మంత్రి
  • బీజేపీ పాలనలో అన్ని విధాలుగా దేశంలో అణిచివేత కొనసాగుతోందని వ్యాఖ్య
  • ఏడాది కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
కుటుంబ సర్వేలో పాల్గొనని కేసీఆర్ కుటుంబం కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతోందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, స్వాతంత్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు.

బీజేపీ పాలనలో దేశంలో అన్ని విధాలుగా అణిచివేత కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమం అవసరమని ఆయన అన్నారు. రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు. ఏడాది కాలంలోనే తాము ఎన్నో అభివృద్ధి పనులు చేశామని అన్నారు.

అయితే, వాటిని ప్రచారం చేసుకోవడంలో వెనుకబడిపోయామని తెలిపారు. దేశం మొత్తంలో ఈ ఏడాది తెలంగాణలోనే ఎక్కువ ధాన్యం పండించినట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన అన్నారు.

Uttam Kumar Reddy
Congress
Telangana

More Telugu News